కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. వ్యాక్సిన్ ఎప్పుడొచ్చినా దీన్ని అందరికీ పంపిణీ చేసేందుకు ప్రపంచ దేశాలు సిద్ధమవుతున్నాయి.ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్కు సంబంధించిన కీలక సమాచారం బయటకు వచ్చింది. వ్యాక్సిన్ ఒక్కసారి వేసుకుంటే సరిపోదని దీన్ని వేసుకుంటూనే ఉండాలని చెబుతున్నారు.
సీరం ఇనిస్టిట్యూట్ ఇండియా సీఈవో ఆధార్ పూనవల్లా కరోనా వ్యాక్సిన్ గురించి మాట్లాడారు. ప్రపంచంలో ఇప్పటి వరకు చాలా వ్యాక్సిన్లు తయారుచేస్తున్నట్లు చెప్పారు. అయితే ఏ వ్యాక్సిన్ను కూడా ఒక్కసారి తయారు చేసి ఆపలేదని.. నిత్యం తయారుచేసి ప్రజలకు అందిస్తూనే ఉన్నట్లు తెలిపారు. అంటే కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ప్రపంచంలోని జనాభాకు మొత్తం దీన్ని వేస్తారు. అయితే ఆ తర్వాత వ్యాక్సిన్ తయారుచేయడం ఆపకుండా ఇంకా తయారుచేస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం పిల్లలకు వ్యాక్సిన్లు, పెద్దలకు జబ్బులకు సంబంధించిన వ్యాక్సిన్లు ఏ విధంగా వేస్తుంటామో కరోనా టీకా కూడా రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి అందరూ వేసుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రపంచానికి సుదీర్ఘ కాలంపాటు కోవిడ్-19 వాక్సీన్ల అవసరం ఉంటుదని ఆధార్ పేర్కొన్నారు. జనాభాలో 100 శాతానికి కరోనా టీకా ప్రక్రియ పూర్తిచేసినప్పటికీ, భవిష్యత్తులోమరో 20 ఏళ్లపాటు ఈ టీకాల అవసరం తప్పక ఉంటుందన్నారు. అయితే కరోనా టీకా వ్యాధి రాకుండా నిరోధించలేదని చెప్పారు. కేవలం వ్యాధి తీవ్రతను తగ్గిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతుందన్నారు. ఈయన మాటలను బట్టి కరోనా వ్యాక్సిన్ వచ్చినా కరోనా రాకుండా మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అర్థమవుతోంది. మీజిల్స్ వ్యాక్సిన్ అత్యంత శక్తివంతమైన టీకా అని 95 శాతం వ్యాధి నివారణ సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు.