సమాజంలో ఒక్కొక్కరు ఒక్కోదాన్ని ఇష్టపడుతుంటారు. కొందరు జంతువులు, కొందరు పక్షలు ఇలా ఎవరకి నచ్చిన దారిలో వాళ్లు వెళుతుంటారు. అయితే ఇలా నచ్చిన వాటి పట్ల ప్రేమను చూపించడంలో పిల్లలు ముందు వరుసలో ఉంటారు.
సరిగ్గా అలాంటిదే తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓ పిచ్చుకను, దాని పిల్లలను కాపాడేందుకు హీరోలా ముందుకొచ్చాడు ఓ పిల్లవాడు. ఇందుకోసం ఏకంగా ఊరు మొత్తాన్ని ఏకం చేశాడు. ప్రేమ ఎవ్వరిదైనా ఒక్కటే అన్నట్లు పిచ్చుక కోసం ఏకంగా నెలరోజులకు పైగా కరెంటు సరఫరా నిలిపివేశారు ఆ గ్రామస్థులు.
శివగంగ జిల్లాలోని పోతకుడి అనే గ్రామంలో విద్యుత్ సరఫరా ఆన్ చేసే స్విచ్ బోర్డు ఉన్న ప్రాంతంలో ఓ పిచ్చుక గుడ్లు పెట్టింది. ఇదే విషయాన్ని ఆ గ్రామానికి చెందిన ఓ విద్యార్థి గ్రహించాడు. అయితే వీధిలైట్లు వెలిగించడానికి సమయం అవ్వడంతో.. ఆ పిచ్చుక గూటిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామంలోని మరికొందరితో మాట్లాడి గ్రామ సర్పంచ్ వద్దకు వెళ్లి విషయం చెప్పారు.
విద్యార్థి చెప్పిన మాటలను అర్థం చేసుకున్న వారంతా పిచ్చుక అక్కడి నుంచి పూర్తిగా వెళ్లిపోయే వరకు వీధిలైట్లు వెలిగించకుండా ఇలానే ఉందామని నిర్ణయించుకున్నారు. మొత్తానికి 30 రోజుల తర్వాత పిచ్చుక తన పిల్లలతో వెళ్లిపోయింది. అప్పటివరకు గ్రామంలోని 35 వీధి ధీపాలను వెలిగించకుండా అలానే ఉంచారు. నెల రోజుల తర్వాత ఈ విషయాన్ని పోతకుడి ఇల్లింగనర్గల్ అనే వాట్సాప్ గ్రూప్లో ఆ విద్యార్థి షేర్ చేశాడు. పిచ్చుకలను కాపాడేందుకు నెల రోజులకు పైగా కరెంటు సరఫరా లేకుండా ఉన్న ఆగ్రామస్థులను ఇప్పుడు విషయం తెలిసిన వారంతా అభినందిస్తున్నారు.