రానున్న శీతాకాలంలో కరోనా వైరస్ విజృంభిస్తుందన్న ఆందోళన నెలకొంది. ఇప్పుడే దేశంలో కరోనా అదుపులోకి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది. అయితే అంత్యత దగ్గరలో శీతాకాలం వస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది.
నీతి ఆయోగ్ కూడా శీతాకాలంలో కరోనా వైరస్ విజృంభణపైనే ఆందోళన వ్యక్తం చేస్తోంది. శీతాకాలంలో కరోనా వైరస్ విజృంభిస్తుందన్న వార్తలను కొట్టిపారేయలేమని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. అంటే కరోనా ఎక్కువవుతుందన్న దానిపై క్లారిటీ లేదని అర్థం అవుతోంది. యూరప్లో ఇప్పటికే రెండో సారి కరోనా వ్యాపిస్తోంది. దీన్ని పరిగణలోకి తీసుకొని ఏమైనా జరగొచ్చన్న రీతిలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాగా దీనిపై పరిశోధనలు జరుపుతున్నట్లు చెప్పారు.
ఇక కరోనా టీకా గురించి మాట్లాడుతూ టీకా అందుబాటులోనికి వచ్చిన వెంటన ఏ విధంగా సరఫరా చేయాలన్న దానిపై క్లారిటీగా ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. కోల్డ్ స్టోరేజీలు కూడా అందుబాటులో ఉన్నాయని అవసరమైతే వాటిని పెంచుకుంటామన్నారు. మరోవైపు కరోనా గరిష్ట స్థాయిని దాటిపోయిందని కేంద్రం నియమించిన కోవిడ్ ప్రత్యేక కమిటీ వెల్లడించింది. పకడ్బంధీ చర్యలు తీసుకుంటే రానున్న ఫిబ్రవరి నెల కంతా కేసులు తగ్గిపోతాయని తెలిపింది. మాస్కులు వాడటం, సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజ్ చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకూడదని కమిటీ పేర్కొంది.