కరోనా వైరస్ ఏ రూపంలో వస్తుందో తెలియక అంతా భయపడిపోతున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకొని, సామాజిక దూరం పాటించడం వల్ల కరోనా వైరస్ సోకకుండా ఉండొచ్చని అంటున్నారు. అయితే ఇదే సమయంలో ప్రజలు బయటకు వచ్చినప్పుడు ఏం చేయాలన్న హడలెత్తిపోతున్నారు.
కరోనా వచ్చిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వడం పూర్తగా మానేశారు. అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా సోకుతూనే ఉంది. దీంతో పలువురు కామెంట్లు చేస్తూ వార్తా పత్రికలు చదవడం వల్ల కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందన్న ప్రచారం జోరుగా సాగింది. దీంతో ఎంతో మంది న్యూస్ పేపర్లను తమ ఇళ్లకు, కార్యాలయాలకు తెప్పించుకోవడం మానేశారు. ఇప్పటి వరకు కూడా చాలా మంది న్యూస్ పేపర్లు చదవకుండా దూరంగా ఉంటున్నారు. అవసరమైతే ఆన్లైన్లో పేపర్ చదువుతున్నారు.
అయితే న్యూస్ పేపర్లు చదవడం వల్ల కరోనా వస్తుందన్న దానిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ వార్తా పత్రికల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతుందనడానికి సరైన శాస్త్రీయ ఆధారాలు కూడా లేవని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలోనూ వార్తాపత్రికలు చదవడం పూర్తిగా సురక్షితమన్నారు. ఇక కరోనా వ్యాక్సిన్కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ వేగంగా జరుగుతున్నాయి. సీరం ఇండియా, భారత్ భయోటెక్లు క్లినికల్ ట్రయిల్స్ జరుపుతున్నాయి. మూడో దశ పరీక్షల్లో వేలాది మంది పాల్గొంటున్నారు.