జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. గత వారం రోజులుగా ఏదో ఒకసారి ఉగ్రవాదుల నుంచి సమస్య వస్తూనే ఉంది. ప్రధానంగా పుల్వామా జిల్లాలోనే ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో భద్రత దళాలు అప్రమత్తమయ్యాయి.
జమ్మూ-కశ్మీరులోని పుల్వామా జిల్లాలో గుర్తు తెలియని ఉగ్రవాదులు భద్రతా దళాలపై దాడి చేశారు. గ్రెనేడ్ విసరడంతో ఓ సీఆర్పీఎఫ్ జవానుకు స్వల్ప గాయాలయ్యాయి. పుల్వామా జిల్లాలోని ట్రాల్ పట్టణంలో ఈ దారుణం జరిగింది. దీంతో ఒక్కసారిగా దళాలు అప్రమత్తమయ్యాయి. ఘటనకు పాల్పడిన వారిని గాలించే పనిలో ఉన్నారు. సీఆర్పీఎఫ్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, సీఆర్పీఎఫ్ 139వ బెటాలియన్ దళాలపై గుర్తు తెలియని ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. ఆదివారం ఉదయం 11.45 గంటలకు ఈ దారుణం జరిగింది. ఓ సీఆర్పీఎఫ్ జవానుకు స్వల్ప గాయాలయ్యాయి.
వెంటనే తేరుకున్న భద్రతా దళాలు గాయపడిన జవానును వెంటనే పుల్వామా జిల్లా ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్లోనే ఉన్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది. దాడి జరిగిన ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు జరుగుతోంది. ఓ లష్కరే తొయిబా ఉగ్రవాదిని పుల్వామా జిల్లాలో శనివారం అరెస్టు చేశారు. 24 గంటలలోపే భద్రతా దళాలపై దాడులు జరగడం ఆందోళన కలిగించే అంశమని చెప్పొచ్చు. జమ్మూకశ్మీరులో లష్కరే తోయిబా ఉగ్రవాదుల రహస్య ఆయుధగారం గుట్టును ఈ నెల 17వ తేదీన జమ్మూకశ్మీర్ పోలీసులు రట్టు చేశారు.
పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద జేహలూం నదీ తీరానికి సమీపంలోని కావానీ గ్రామం వద్ద లష్కరేతోయిబా ఉగ్రవాదులు రహస్యంగా ఆయుధగారం ఏర్పరచుకున్నారు. ఈ రహస్య గదిలో ఐరన్ రాడ్లు, మందుగుండు సామాగ్రి, తుపాకులు, పిస్టళ్లు, ఏకే 47 తుపాకులు, మూడు గ్రెనెడ్లు లభించాయి. ఈ ఆయుధగారాన్ని పోలీసులు పేల్చివేశారు.