ఏపీలో 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల పేర్లను జగన్ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు జాబితా విడుదల చేసింది. చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో అన్ని జిల్లాలకూ ప్రాతినిథ్యం కల్పించారు. వీటి వివరాలను మంత్రులు ప్రకటించారు. చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో అన్ని జిల్లాలకు ప్రాధాన్యం ఇస్తూ.. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
చరిత్రలో ఈ రోజు నిలిచిపోతుందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. బీసీల గుండెల్లో జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఇక చంద్రబాబు నాయుడు కేవలం బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని విమర్శించారు. అధికారంలో భాగస్వామ్యం ఇచ్చేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. కాగా ఈ కార్పోరేషన్ల ద్వారా బీసీలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు రూ. 20వేల కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. బీసీల అభ్యున్నతికి సీఎం ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని, ప్రభుత్వ పథకాలు అందేలా కార్పొరేషన్లు బాధ్యతలు తీసుకోవాలన్నారు. 16 నెలల్లో బీసీలకు రూ.33,500 కోట్లు ఖర్చు చేశామని కృష్ణదాస్ పేర్కొన్నారు.
కార్పొరేషన్ల ద్వారా బీసీలకు సంక్షేమ ఫలాలను సీఎం చేరువ చేశారని, బలహీన వర్గాలను గుర్తించి సీఎం పదవులు ఇస్తున్నారని వేణుగోపాల్ కొనియాడారు. బీసీలు ఆర్థికంగా ఎదగాలని సీఎం జగన్ భావించారని, ప్రతి కార్పొరేషన్లో మహిళలకు 50శాతం చోటు కల్పించారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ తెలిపారు. బీసీలకు ఆర్థిక సహాయం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని కార్పోరేషన్ల ద్వారా అందించనుంది. ఈ రుణాలకు సంబంధించిన అధికారాన్ని మొత్తం కార్పోరేషన్ ఎండీలకే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ కార్పోరేషన్ల ద్వారా జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారా రుణాలు పొందే అవకాశం ఉంది.