ప్రపంచంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. చాలా దేశాల్లో కేసుల తీవ్రత ఇంకా పెరుగుతూ పోతుంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. దీంతో మరోసారి లాక్డౌన్ దిశగా అడుగులు పడుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 4 కోట్ల మందికి కరోనా సోకింది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా వ్యాక్సిన్ రావడానికి తక్కువగా అంటే కూడా మూడు నాలుగు నెలల సమయం పడుతుంది. ఆ తర్వాత వ్యాక్సిన్ను అందరకీ అందజేయాలంటే మరో మూడు నెలలైనా పడుతుంది. దీంతో కరోనా తీవ్రత ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే అంతవరకు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది. అయితే పలు దేశాలు మాత్రం ఇక లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి.
యూరప్, ఇటలీ, జర్మనీ దేశాలు మొదలుకొని పోర్చుగల్ వరకూ కరోనా కేసులు రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాయి. లండన్లో ఉంటున్నవారు ఇతరులను తమ ఇళ్లకు రానివ్వడం లేదు. అలాగే ఫ్రాన్స్లోని ప్యారిస్తో పాటు మరో 8 నగరాలకు చెందిన ప్రజలు నాలుగు వారాల పాటు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ తమ ఇళ్లలోనే ఉండేందుకు మొగ్గుచూపుతున్నారు. స్పెయిన్లో కొత్తగా 6,593 కేసులు నమోదు కాగా, ఇటలీలో కొత్తగా రికార్డు స్థాయిలో 10,010 కేసులు నమోదయ్యాయి. బెల్జియంలో నాలుగువారాల పాటు రెస్టారెంట్లను మూసివేయాలని నిర్ణయించారు.
కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న పరిస్థితుల్లో బ్రిటీష్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా లండన్, టూ టైర్, త్రీ టైర్ నగరాల్లో, కరోనా తీవ్రత ఎక్కువగా ప్రాంతాల్లో భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు కూడా భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనంటూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఒకే ఇంట్లో నివసిస్తున్న వాళ్లు ఎలాంటి దూర పాటించకుండా ఉండొచ్చని తెలిపింది. ఎవరైతే భర్త ఒకచోట, భార్య ఒక చోట నివాసం ఉంటారో వాళ్లు మాత్రం కలిసినప్పుడు కచ్చితంగా ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించాలని చెప్పింది. మరి ఈ పరిస్థితులు ప్రపంచం మొత్తం వ్యాపిస్తాయా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మాస్క్ పెట్టుకుంటారా లేక లాక్ డౌన్ విధించాలా అని అడిగారు. దీంతో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.