దేశంలో భారీ మెజార్టీతో గెలిచిన మోదీ ఆ తర్వాత ఊహించని రీతిలో చిక్కుల్లో పడుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే దేశ వ్యాప్తంగా జరుగుతున్న పలు ఘటనలు ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నాయి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ అదును చేసుకొని మోదీ సర్కార్పై విరుచుకుపడుతోంది.
ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మోదీ సర్కార్కు తీవ్ర ఇబ్బందులు వచ్చాయని చెప్పొచ్చు. ఎందుకంటే హథ్రాస్లోకి వెళ్లేందుకు రాజకీయ పార్టీల నాయకులకు, మీడియాను కూడా అనుమతి ఇవ్వలేదు. దీంతో ఉత్తరప్రదేశ్ సర్కార్తో పాటు మోదీ ప్రభుత్వంపై కూడా అందరూ ఈ ఘటనపై మండిపడ్డారు. ఈ విషయంపై కాంగ్రెస్ కూడా బాగానే పోరాటం చేసింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు సైతం హథ్రాస్కు వెళ్లి వచ్చారు.
ఇప్పుడు తాజాగా మోదీపై రాహుల్, ప్రియాంకలు ట్విట్టర్ వేదికగా ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లలను రక్షించడం కంటే.. అపరాధులను రక్షించే పనులే కొనసాగుతున్నాయంటున్నారు. యూపీలో జరుగుతున్న ఘటనలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. బేటీ బచావోతో ప్రారంభమైన ఈ పథకం.. అపరాధి బచావో దిశగా సాగుతోందని రాహుల్ అన్నారు. ఈ సంఘటన ఏ పథకం కింద చేపట్టారో అని ప్రియాంక అన్నారు. కాగా ఇటీవల జైళ్లో బంధించిన ఓ నిందితుడిని బీజేపీ ఎమ్మెల్యే విడిపించి తీసుకెళ్లిన ఘటనను ఉద్దేశించి ఇలా వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి మహిళలపై జరుగుతున్న నేరాలు మోదీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉన్నాయని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.