కరోనా బాదితుల పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలని ప్రభుత్వం చెబుతున్నా అది క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. కరోనా రోగులు, వారి కుటుంబ సభ్యుల పట్ల వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉంటోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. తన భర్తకు కరోనా సోకి కోవిడ్ కేర్ సెంటర్లో ఉంటే.. భార్యను ఇంట్లోకి అనుమతించలేదు ఆ ఇంటి యజమాని. సొంతిటికి వెళ్లినా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో రాత్రంతా ఇంటి బయటే ఉంది ఆ మహిళ.
వివరాల్లోకి వెళితే రాజమహేంద్రవరం ఐ.ఎల్.టి.డి జంక్షన్ సమీపంలో నివాసం ఉండే ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఆయన భార్య బుర్రిలంకలో ఎన్.ఎం.గా విధులు నిర్వర్తిస్తోంది. తన భర్తకు కరోనా రావడంతో వీరు నివాసం ఉండే ఇంటి యజమాని ఈమెను ఇంట్లోకి అనుమతించలేదు. బాదితురాలు తన సొంతింటికి వెళ్లగా అక్కడ స్థానికులు అడ్డుకుని ఆమె ఇంటికి తాళం వేశారు.
స్థానిక కోవిడ్ కేంద్రంలో తన భర్త చికిత్స తీసుకుంటున్నాడని బాదితురాలు తెలిపింది. తనను సొంత ఇంట్లోకి అనుమతించకపోవడంతో రాత్రంతా బయటే కూర్చున్నానని కన్నీరుమున్నీరైంది. పలువురు అధికారులకు ఫోన్ చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదని తెలిపింది. స్థానికులంతా తన పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపింది. అయితే తన భర్తకు పాజిటివ్ వచ్చినా ఈమెకు మాత్రం నెగిటివ్ ఉన్నట్లు తెలిసింది. ఏదిఏమైనా మనం పోరాడాల్సింది వ్యాధితో.. రోగితో కాదన్నది అందరూ తెలుసుకోవాలి..