భారత్, చైనా మధ్య వాతావరణం బయటకు చల్లబడుతున్నట్లు కనిపిస్తున్నా లోపల మాత్రం రాజుకుంటూనే ఉన్నట్లు అనిపిస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇందుకు నిదర్శనంగా మనం చెప్పొచ్చు. సరిహద్దులో బలగాల మొహరింపును బట్టి చూస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతాయి.
లద్దాఖ్లో చైనా భారీగా బలగాలను మొహరిస్తోంది. ఒకవైపు చొరబాట్లకు సంబంధించి ఇరు దేశాలు చర్చలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు అసంపూర్తిగా ఉన్న నేపథ్యంలో డ్రాగన్ మరోసారి తన వక్రబుద్ది చాటుకున్నట్లు కనిపిస్తోంది. బలగాలను వెనక్కు తీసుకుంటామని చెబుతూనే.. వేలకు వేల బలగాలు మొహరింపు చేస్తోంది.
అరుణాచల్ ప్రదేశ్లో 65వేల చదరపు కిలోమీటర్ల భూభాగంపై చైనా కన్నేసింది. ఈ ప్రాంతం తమదేనని చైనా వాదిస్తోంది. లద్దాఖ్లో చైనా, భారత్కు సంబంధించిన సైనికులు ఎల్.ఏ.సికి అటూఇటూ ఉన్నారు. ఇప్పటికే ఈ వివాదంపై ఇరు దేశాలు చర్చిస్తున్నా ప్రతిష్టంభన వీడలేదు.
ఇదిలా ఉంటే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లోని మెక్ మోహన్ రేఖ వైపు 40వేలకు పైగా బలగాలను చైనా తరలించింది. సరిహద్దులో చైనా సైన్యం కదలికలను భారత్ ఎప్పటికప్పుడు అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో చైనా పెద్ద సంఖ్యలోనే బలగాలను మొహరిస్తున్నట్లు తెలిసింది.
చైనాకు ధీటుగా సమాధానం చెప్పేందుకు మనదేశం సర్వసన్నద్ధమవుతోంది. యుద్ధ సామాగ్రితో పాటు బలగాలను అరుణాచల్ ప్రదేశ్కు చేర్చుతోంది. ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత వాయుసేనకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఏ క్షణం ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవాలని చెప్పారు. కాగా ఈశాన్య రాష్ట్రాల నుంచి భారీగా బలగాలను భారత్ తరలిస్తోంది.