అంటే అన్నామంటారు. అన్నందుకు కోపాలు రావటమే కాదు.. ఏ మాత్రం అవకాశం చిక్కినా కేసు పెట్టేయటానికి సైతం వెనుకాడరు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అడ్డదిడ్డంగా తప్పుల మీద తప్పులు మాట్లాడేయటం లోకేశ్ బాబుకు మాత్రమే సాధ్యమవుతుందేమో?
ఆ మధ్యన అంబేడ్కర్ వర్థంతి శుభాకాంక్షలంటూ కొందరికి షాకిస్తే.. వచ్చే ఎన్నికల్లో 200 సీట్లు అంటూ మరోసారి తప్పుల లెక్కలు చెప్పేశారు. ఇలా తరచూ అచ్చు తప్పులతో మాట్లాడటం.. ఎవరైనా ఎత్తి చూపిస్తే వారి మీద విరుచుకుపడటం లోకేశ్ అండ్ టీంకు ఒక అలవాటుగా మారిందన్న విమర్శ వినిపిస్తోంది. ఇప్పటికే తప్పుల మీద తప్పులు మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న లోకేశ్.. ఈ రోజు అదే రీతిలో మరోసారి తప్పులు మాట్లాడేశారు.
ఏపీ ఐటీ.. పంచాయితీరాజ్.. గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న లోకేశ్ ఈ రోజు విశాఖలో అంతర్జాతీయ ఆవిష్కరణల ప్రదర్శన 2017లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన లోకేశ్.. ఆంధ్రప్రదేశ్ ను ఒక దేశంగా (ఏపీ కంపెనీ) చెప్పటం గమనార్హం. మరో సందర్భంలో ఏపీని కంపెనీగా అభివర్ణించటం చూసినప్పుడు ఒకే సందర్భంలో ఒక రాష్ట్ర మంత్రిగా ఇన్నేసి తప్పులు మాట్లాడటం ఏమిటని ఆశ్చర్యపోకమానదు. మాట్లాడే ముందు కాస్త ఏం మాట్లాడుతున్నామో చూసుకొని మాట్లాడితే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.