వాతావరణ పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులు చేజారిపోతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తన్న వర్షాల కారణంగా జనజీవనం స్థంబించిపోయింది. హైదరాబాద్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్ నలుమూలలా నీటితో నిండిపోయింది. ఏ ప్రాంతం గురించి తెలుసుకుందామని అనుకున్నా వరద నీరే వచ్చి చేరింది. ప్రజలెవ్వరూ బయటకు రావడానికి వీల్లేదు. జాతీయ రహదారులు కూడా వరద నీటికి కోతకు గురయ్యాయి. దీంతో హైదరాబాద్ బెంగుళూరు జాతీయ రహదారి శంషాబాద్ సమీపంలో తీవ్రంగా దెబ్బతినింది. పలు వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ రవాణా మార్గం కోసం అన్వేషిస్తున్నారు.
ఇక మూడు రోజుల పాటు ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలందరూ సహకరించాలని అధికారులు కోరుతున్నారు. హైదరాబాద్లో 15 వందల కాలనీలు నీటిలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అధికారులు లోతట్టు ప్రాంతాల వారిని ఒడ్డుకు చేర్చే పనిలో ఉన్నారు. ఈ రోజు కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు హైదరాబాద్లో కురుస్తాయని చెబుతున్నారు. అవసరం అయితేనే బయటకు రావాలని లేదంటే మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.