ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడిన సినీనటి కుష్బూ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆమె మొదట సైలెంట్గా ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ పై మాటల యుద్దం దాడి చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ మరింత డౌన్ అయ్యేట్లు కనిపిస్తోందని మేధావులు అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు ఎందుకు వెళ్లిపోతున్నారో కూడా తెలియని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఖుష్బూ అన్నారు. ఆరేళ్ల తర్వాత పార్టీ నుంచి ఒకరు ఎందుకు వెళ్లిపోతున్నారో కూడా యోచించే శక్తి లేని, మతిస్థిమితంలేని పార్టీగా కాంగ్రెస్ తయారైందన్నారు. బీజేపీలో చేరడానికి రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్ ప్రధాన కారణమని తెలిపారు. ఓ నాయకుడు పార్టీని బలపరిచేందుకు తమ పార్టీలోకి రండి అంటూ సాదరంగా ఆహ్వానిస్తుండగా, మరో పార్టీ నాయకుడు ఆరేళ్లుగా తాను పార్టీలో ఉన్నా ఓ నటిగానే చూశానని చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు.
ఆరేళ్లుగా పార్టీ అభివృద్ధి కోసం తన శక్తినంతా ధార పోసి, ఆ పార్టీ నుంచి వైదొలగినప్పుడు ఆ విషయంపై యోచించడానికి కూడా వీలులేని మెదడుతో ఉన్న పార్టీలా కాంగ్రెస్ ఉందని ఆమె విమర్శించారు. తాను పదవి కోసం బీజేపీలో చేరలేదని, తనకన్నా సీనియర్లు పార్టీలో ఉన్నారని చెప్పారు. దేశానికి మేలు జరగాలంటే బీజేపీ అధికారంలో ఉండాలని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తానని ఆమె శపథం చేశారు. ఏ పార్టీలో ఉన్నా ప్రజలకు మేలు చేయాలన్నదే తన ప్రధాన ఆశయమని అన్నారు.
ఖుష్బూ వ్యాఖ్యలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుంటున్నా అదిష్టానం మాత్రం సీరియస్గానే తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్న రాహుల్ గాంధీ.. ఖుష్బూ విషయంలో ఏం జరిగిందో తెలుసుకుంటున్నారంట.