అమెరికాలో అధ్యక్ష్య ఎన్నికల ఉత్కంఠత ఇంకా కొనసాగుతూనే ఉంది. అధ్యక్ష్య పదవి కోసం డొనాల్డ్ ట్రంప్తో పాటు జో బైడెన్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ హోరాహోరీగా పోటీ పడుతున్నారు. అయితే ఎన్నికల్లో తప్పకుండా తామే విజయం సాధిస్తామని బైడెన్ ధీమాగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు కరోనా సవాల్ విసురుతోంది.
అమెరికాలో ఎన్నికల హడావిడి ఓవైపు ఉంటే మరో వైపు కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా కేసులు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. అయితే ఎన్నికల వల్లనే కరోనా విజృంభించిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే అమెరికాలో 1,27,000పైగా కేసులు నమోదైనట్లు జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ పేర్కొంది. ఇక 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,149 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో కరోనా మరణాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అమెరికా ఒకటి. అయితే కరోనా మరణాలు తక్కువ అయ్యాయని అనుకుంటున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా కేసులు పెరుగుతున్నాయి.
గత నాలుగు రోజులుగా వెయ్యికి పైగా మరణాలు సంభవించడం ఆందోళన కలిగించే విషయం. ఇప్పటివరకు అమెరికా వ్యాప్తంగా 9.7 మిలియన్లకు పైగా మందికి కరోనా సోకగా.. 2.36 లక్షల మంది మరణించారు. కాగా, డిసెంబర్లోగా కొవిడ్ వ్యాక్సిన్పై పూర్తి సమాచారం తెలుస్తుందని ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఇటీవల వెల్లడించారు. కనుక వచ్చే ఏడాది జనవరి వరకు అమెరికాలో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలో కరోనా కేసులు పెరిగేందుకు కారణం డొనాల్డ్ ట్రంప్ అన్న ప్రచారం కూడా సాగుతోంది. కరోనా కారణంగానే ట్రంప్కు ఎన్నికల్లో వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో అధ్యక్షుడు ఎవరైనా మరోసారి కరోనాతో యుద్ధం చేయాల్సిందే.