దేశంలో ప్రస్తుతం అందరూ ఎన్నికల గురించే ఆలోచిస్తున్నారు. ఒకటి బీహార్ ఎన్నికలైతే మరోకటి అమెరికా అధ్యక్ష్య ఎన్నికలు. ఇప్పటికే అమెరికాలో దీని గురించి హై టెన్షన్ నెలకొంది. కాగా మరో రెండు గంటలు ఆగితే బీహార్ ఎవరిదో చెప్పేయడానికి అందరూ రెడీగా ఉన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత అంటే చివరి విడత పోలింగ్ మరి కొద్ది గంటల్లోనే ముగియనుండటంతో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్పైనే ఉంది. ఎగ్జిట్ పోల్స్పై ఉన్న నిషేధం శనివారం సాయంత్రం 6.30 గంటలతో ముగియనుంది. అప్పటికే పోలింగ్ సమయం కూడా ముగిసిపోతుంది. దీంతో ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉంటాయో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, జేడీయూ పోటీ పడుతున్నాయి. ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికల్లో పోలింగ్ నేటితో ముగిస్తోంది. దీంతో ఇక అందరి దృష్టీ రిజల్ట్స్ ఎలా ఉంటాయో అన్న దానిమీదే ఉంది. అయితే ఫలితాల కంటే ముందు వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పనున్నాయో అన్న ఆందోళన అందరిలోనూ ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ను ప్రతి సారి విశ్వసించలేం. 2015లో యాక్సిస్ ఏపీఎం మినహా ఎన్నికల విశ్లేషకులంతా మహాఘట్ బంధన్ (జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్)ను తక్కువగా అంచనా వేశాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు సునాయాసంగా మెజారిటీ వస్తుందని అంచనా వేశాయి. అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 243 సీట్లలో మహాకూటమి 180 సీట్లు గెలుచుకుంది. ఒక్క యాక్సిస్ ఏపీఎం మాత్రమే మహాకూటమికి 169 నుంచి 183, ఎన్డీయేకు 58 నుంచి 70 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకి మూడింట రెండు వంతుల మెజారిటీ వస్తుందని ‘టుడేస్ చాణక్య’ అంచనా వేసింది. ఫలితాల తర్వాత టుడేస్ చాణక్య క్షమాపణ కూడా చెప్పింది. బీహార్ ఎన్నికలను సరిగా అంచనా వేయలేకపోయినందుకు తమ మిత్రులు, శ్రేయాభిలాషులందరికీ క్షమాపణలు చెబుతున్నాయని, గెలుపొందిన కూటమికి అభినందనలని తెలిపింది. ఎన్డీటీవీ, ఇండియా టుడే-సిసెరో కూడా ఎన్డీయేకు పూర్తి మెజారిటీ వస్తుందని అంచనా వేశాయి. కాగా ఈ సారి బీజేపీ, జేడీయూ కలిసి పనిచేస్తున్న పరిస్థితుల్లో ఎవరికి ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఉంటాయో అన్న ఉత్కంఠత నెలకొంది.