కరోనా ప్రపంచాన్ని తలక్రిందులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇండియన్లు కూడా దీనికి భారీగా మూల్యం చెల్లించుకున్నారు. గల్ఫ్లో భారతీయులు భారీ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతున్నారు. మహమ్మరి వల్ల ఇప్పటి వరకు సౌదీ నుంచి 2 లక్షల 32 వేల 556 మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వెళ్ళినట్లు తెలిసింది.
కరోనా లాక్డౌన్ వల్ల ఇండియాలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి. అయితే ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు పరిస్థితి మాత్రం చాలా భిన్నంగా ఉంది. ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో రెండు లక్షలకు పైగా ఇండియన్లు ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. వీరంతా 1,295 ప్రత్యేక విమానాల ద్వారా ఇండియాకు చేరుకున్నారు. సౌదీలో మహమ్మరి ప్రభావం మొదలయినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 2,158 మంది భారతీయులు మరణించగా, అందులో 850 మంది కరోనా కాటుతో చనిపోయినట్లుగా రాయబారి తెలిపారు. ఈ వివరాలను భారత రాయబారి డా. ఔసఫ్ సయీద్ తెలిపారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే.. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతున్నందున జైళ్ళలో శిక్ష కాలం ముగిసినప్పటికి అనేక మంది భారతీయ ఖైదీలు స్వదేశానికి రాలేకపోయారని, వీరి ప్రయాణ విధానం వేరుగా ఉంటుందని అన్నారు. కాగా, ఇప్పటివరకు 2,200 మంది ఖైదీలు డిపోర్టేషన్ సెంటర్ల నిర్బంధం నుంచి స్వదేశానికి చేరుకున్నారని రాయబారి చెప్పారు. కొవిడ్ నిబంధనల కారణంగా పాస్పోర్టు సేవల్లో కొంత జాప్యం జరిగినప్పటికి 82,270 మందికి పాస్పోర్టు అందించినట్లు ఆయన పేర్కొన్నారు. సౌదీ అరేబియాలో ఉద్యోగాలు చేస్తున్న వారు కరోనా కంటే ముందు స్వదేశానికి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయారని, వారిని తిరిగి సౌదీకి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా రాయబారి తెలిపారు. రెండు దేశాల మధ్య ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకోవడానికి భారతీయ ఎంబసీ గట్టిగా ప్రయత్నిస్తుందని ఆయన వెల్లడించారు. ప్రపంచంలోని మిగత దేశాలతో పోలిస్తే భారత్లో కరోనా ప్రభావం తక్కువ అని అన్నారు.