ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా రైల్వే శాఖ పలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అయితే కరోనా తర్వాత రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు రైళ్లు నడుస్తున్నాయి. దీంతో రైల్వే శాఖ పలు నిబంధనలు తీసుకొస్తోంది.
ప్రస్తుతం రైల్వేశాఖ టికెట్ బుకింగ్కు సంబంధించిన ఓ కొత్త నిబంధనను అమలు చేయనుంది. అదేమిటంటే. రైళ్లు బయలుదేరాల్సిన నిర్ణీత సమయానికి 30 నిమిషాల ముందు సెకెండ్ రిజర్వేషన్ ఛార్ట్ సిద్ధం చేస్తారు. గతంలో కరోనా మహమ్మారి సమయంలో ప్యాసింజర్ల సౌకర్యార్థం నిర్ణీత రైలు సమయానికి 2 గంటల ముందు ఛార్ట్ సిద్ధం చేసేవారు. కరోనా మహమ్మారికి ముందు, కేవలం ఒకే ఛార్ట్ సిద్ధం చేసేవారు. అదికూడా రైలు నిర్ణీత సమయానికి 4 గంటల ముందు చేసేవారు.
కాగా, ఐఆర్సీటీసీ తాజా నిర్ణయంతో మిగిలిపోయిన సీట్లను ప్రయాణికులు ఆన్లైన్ ద్వారా కానీ, ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా కానీ పొందవచ్చు. కొత్త మార్పులతో చివరి నిమిషంలో ప్రయాణం చేయాల్సి వచ్చిన వారికి ప్రయోజనం కలుగుతుంది. అలాగే, చివరి నిమిషంలో ప్రయాణం మానుకోవాల్సి వచ్చిన వారికి సెకెండ్ ఛార్ట్ సిద్ధం చేయకముందే టిక్కెట్ కేన్సిల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. రైల్వేశాఖ తీసుకున్న నిర్ణయంతో ప్రయాణీకులకు మంచి జరుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.