వైసీపీ ఎమ్మెల్యే బర్త్డే వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకర్గం ఎమ్మెల్యే శ్రీదేవి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని తిరిగి వెళుతున్న కార్యకర్తల కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు.
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరిడికొండ దగ్గర ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బైక్ను తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వైసీపీ కార్యకర్తలు మృతిచెందారు. ప్రమాదం స్థలంలో ఇద్దరు మృతిచెందగా… ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు వదిలారు. వైసీపీ మహిళా ఎమ్మెల్యే శ్రీదేవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరిగి ఇంటికెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. మృతులు వెల్దుర్తికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు ప్రమాదం జరిగిన చోట ఇద్దరు చనిపోయారు. కాగా మార్గ మధ్యంలో మరొకరు చనిపోయినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే శ్రీదేవి బర్త్డేను పురస్కరించుకుని కార్యకర్తలు ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ ర్యాలీలో కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు. బాణాసంచా పేలుడులో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే బర్త్ డే రోజు ఇలా జరగడంతో క్యాడర్ విషాదంలో మునిగిపోయింది.