కరోనా టీకా వచ్చేస్తోంది. ప్రపంచ దేశాలు తలమునకలై కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. భారత్లో ఇప్పటికే హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై నగరాల్లో ఎంపిక చేసిన వారికి మొదటి విడత పరీక్షల్లో భాగంగా టీకా ఇచ్చారు. హైదరాబాద్లోని నిమ్స్లో ఇద్దరు వాలంటీర్లకు టీకా ఇచ్చి వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. మూడు దశల్లో టీకా పరీక్షలు రెండు మూడు నెలల్లో పూర్తవుతాయని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా వెల్లడించారు.
ఇక ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్ట్ విశ్వవిద్యాలయంలో తయారుచేసిన టీకా విజయంతమైందని అక్కడి శాస్త్రవేత్తలు ప్రకటించారు. మొదటి రెండు డోసులను ఇప్పటికే ప్రయోగించారు. ఇక మూడో దశ క్లినికల్ ప్రయోగాలు చేస్తూనే ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ సమర్థతను ఇంకా నిర్ధారించాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఆక్స్ఫర్డ్ టీకాను ఇండియాలోని సంస్థల్లో కూడా పరీక్షించనున్నారు.
కాగా రష్యా కూడా కరోనా టీకాపై కష్టపడుతోంది. మొదటి రెండు దశలు పూర్తి చేసుకున్న వీరు.. మూడో దశ ప్రయోగాలకు సమాంతరంగా టీకాను ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆలోచిస్తోంది. రెండో దశలో ఇచ్చిన టీకా వల్ల వాలంటీర్లలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని ఆ దేశం ప్రకటించింది. ఆగష్టు 3న మూడో విడత ప్రయోగాలకు సిద్ధమవుతూనే.. టీకా ఉత్పత్తిని చేపట్టనుంది. ఇప్పటికే పలువురు దిగ్గజ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఈ టీకా ఆమోదం పొందకముందే వేయించుకున్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాను అరికట్టేందుకు శాస్త్రవేత్తలు శథవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇండియా, ఇంగ్లాండ్, రష్యా, తదితర దేశాలు పోటీ పడి వ్యాక్సిన్ కనుగొనే పనిలో నిమగ్నమయ్యాయని చెప్పొచ్చు.