ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంటే భారత్లో రికవరీల రేటు పెరుగుతోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియాలోనే రికవరీలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇండియాలో కరోనాను జయించిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.
కరోనాకు వ్యాక్సిన్ రాకముందే ఇండియాలో గుడ్ న్యూస్ వినిపిస్తోంది. దేశంలో రోజురోజుకూ కరోనాను జయించిన వారి సంఖ్య పెరిగిపోతూ ప్రపంచ రికార్డును నెలకొల్పుతోంది. ఇండియాలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 82 లక్షలు ఉంటే.. ఇందులో 75 లక్షల 44 వేల మంది కోలుకున్నారు. దీన్ని బట్టి రికవరీ రేటు ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. ఇక కరోనా కేసులు ఎక్కువగా ఉన్న అమెరికాలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అమెరికాలో 92 లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీటిలో కేవలం 36 లక్షల మంది మాత్రమే కోలుకున్నారు.
ఇక ఫ్రాన్స్లో 14 లక్షల మంది కరోనా బారిన పడగా.. కేవలం లక్ష 23 వేల మంది మాత్రమే కోలుకున్నారు. స్పెయిన్లో 12 లక్షల కోవిడ్ రోగుల్లో కేవలం 50 వేల మంది మాత్రమే రికవరీ అయ్యారు. ప్రపంచంలో ఇప్పటి వరకు 4 కోట్ల 66 లక్షల మందిలో వైరస్ నిర్దారణ అయ్యింది. ఇందులో 3 కోట్ల 11 లక్షల మంది కోలుకున్నారు. ఈ రికవరీల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఇతర దేశాల్లో ఇప్పుడు పరిస్థితి ఆందోళన కరంగానే ఉంది. పలు దేశాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు. కానీ ఇండియాలో మాత్రం పరిస్థితి దాదాపుగా అందుబాటులోకి వచ్చిందని చెప్పొచ్చు. వ్యాక్సిన్ రాకముందే ఈ విధమైన శుభ ఫలితాలు రావడం మంచిదే అంటున్నారు శాస్త్రవేత్తలు.