సుదీర్ఘ సమయం తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు బస్సు సర్వీసులు నడువనున్నాయి. లాక్డౌన్ తర్వాత ఇరు రాష్ట్రాలకు బస్ సర్వీసులు తిరగేందుకు ముహూర్తం ఖరారైంది. మంగళవారం నుంచి బస్సులు తెలుగు రాష్ట్రాల మధ్య రోడ్డెక్కనున్నాయి.
ఇప్పటికే పలుమార్లు ఏపీ, తెలంగాణ అధికారులు సమావేశాలు నిర్వహించారు. ఎట్టకేలకు ఇప్పుడు ఒప్పందం కుదిరింది. ఇంతకుముందు ఏపీ బస్సులు తెలంగాణాలో 1009 సర్వీసులు నడిపేది. ఇప్పుడు 638 బస్సులు మాత్రమే తిప్పడానికి ఒప్పందం కుదిరింది. అదే తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు 750 సర్వీసులు నడిపేది.. ఇప్పటి నుంచి 820 సర్వీసులు తిరుగుతాయి. ఈ మేరకు పూర్తి స్థాయి ఒప్పందాన్ని ఏపీ, తెలంగాణ అధికారులు చేసుకున్నారు.
ఏపీలో తెలంగాణ బస్సులు 1,61,258 కిలోమీటర్ల మేర తిరగనున్నాయి. ఇక తెలంగాణాలో ఏపీ బస్సులు 1,60,999 కిలోమీటర్ల మేర తిరుగనున్నాయి. ఈ ఒప్పందంపై తెలుగుదేశం పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణాలో బినామీ ఆస్తుల రక్షణకు రాష్ట్ర ప్రయోజనాలను పనంగా పెట్టారని పరోక్షంగా సీఎం జగన్ను ఉద్దేశించి ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. లక్షకు పైగా కిలోమీటర్లు కోల్పోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. ఏపీ ప్రభుత్వం భారీ మొత్తంలో కిలోమీటర్లు తగ్గించుకోవడంపై ప్రజల్లో కూడా అసంతృప్తి నెలకొంది. గతంలో మాదిరిగానే నిబంధనలు ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.