కరోనా ప్రభావం తిరుమల వెంకన్నపై పడింది. కోట్లలో ఉండే ఆదాయం తీరా లక్షలకే పరిమితమైంది. దర్శనాల కోసం తితిదే సిద్దంగా ఉన్నప్పటికీ ఆశించిన మేర భక్తులు ఆలయానికి రావడం లేదు.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది ప్రజలు వస్తుంటారు. అయితే కరోనా వచ్చినప్పటి నుంచి భక్తుల సంఖ్య తగ్గిపోయింది. చరిత్రలో ఎప్పూడూ లేని విధంగా తిరుమల ఆలయాన్ని మూసివేయడం ఈ ఏడాదే జరిగింది. మార్చి 20 నుంచి జూన్ 8వరకు శ్రీవారి దర్శనాలు రద్దయిన విషయం తెలిసిందే.
సాదారణంగా రోజుకు రూ. 3 కోట్లు హుండీ ఆదాయం వెంకన్నకు వచ్చేది. ప్రస్తుతం అది రూ. 50 నుంచి 60 లక్షలకు పడిపోయింది. కరోనా అనంతరం పరిమిత సంఖ్యలో రోజుకు మూడువేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను అందుబాటులోకి తెచ్చి ప్రస్తుతం 9వేల వరకు తీసుకొచ్చింది దేవస్థానం. అయినప్పటికీ ప్రజలు మాత్రం కరోనా భయానికి దర్శనానిక రావడం లేదు. టికెట్లు ముందుగా బుక్ చేసుకున్నప్పటికీ వారిలో సగం మంది మాత్రమే దర్శనానికి వస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆదాయం భారీగా తగ్గింది. మామూలుగా ప్రతి రోజూ 3 లక్షల లడ్డూల అమ్మకాలు జరుగుతుండగా ఇప్పుడు అందులో పదిశాతం అమ్మకాలే సాగుతున్నాయి. ఇప్పటికే దేవస్థానంకు సంబంధించి 12వేల కోట్లకుపైగా ఫిక్సుడు డిపాజిట్లు, టన్నుల కొద్దీ బంగారంకు సంబధించిన వడ్డీతో ప్రస్తుతం సర్దుబాటు అవుతోంది. మళ్లీ యథావిధిగా ఆలయం తెరుచుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే టిటిడికి కూడా కొంతమేర ఇబ్బందులు ఎదురవ్వనున్నాయి.