ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని అధిష్టానం మార్చేసింది. కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టనున్నారు.
బీజేపీలో ఏపీ, తెలంగాణాకు కొత్త అధ్యక్షులు నియమిస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఏపీలో కన్నా లక్ష్మీనారాయణనే అధ్యక్ష పదవిలో కొనసాగారు. తాజాగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును అధ్యక్షుడుగా బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈమేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఈయన నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు.
వీర్రాజు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కత్తెరు గ్రామం. గతంలోనే ఈయనకు పదవి రావాల్సి ఉండేదని.. కాగా ఇప్పుడు దక్కిందని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు. పార్టీలో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరుపొందిన ఆయన బలమైన పార్టీలైన వైసీపీ, టిడిపిని ఎదుర్కొని రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాల్సి ఉంది.