దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇటీవలి కాలంలో కాస్త తగ్గింది. తాజాగా హెల్త్ బులిటెన్ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,232 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 90,50,598కి చేరుకున్నాయి.
గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 564 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 1,32,726కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 4,39,747 యాక్టివ్ కేసులున్నాయి. 84,78,124 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 93.67 శాతం కాగా.. మరణాల రేటు 1.47 శాతంగా ఉంది. కాగా మహారాష్ట్రలో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో 5,640 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,68,695కు చేరింది.
గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 155 మంది మృతి చెందారు. ఇదేసమయంలో 6,945 మంది కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 78,272 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కారణంగా మహారాష్ట్రలో ఇప్పటివరకూ 46,511 మంది మృతిచెందారు. మొత్తం 46,511 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ముంబైలో గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 13 మంది మృతి చెందగా, కొత్తగా 1,031 మంది కరోనా బారిన పడ్డారు. 553 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక ఢిల్లీలో సైతం కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని కావడంతో ఈ ప్రాంతంపై అందరి దృష్టీ ఉంది. దీంతో కరోనా నివారణ చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటోంది. కాగా ఢిల్లీలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు కూడా అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.