దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడూ లేనంతా అక్కడ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు గత 14 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాయి. ఇక్కడి ఉష్ణోగ్రతలు 7.5 డిగ్రీలకు పడిపోయాయి. ఇది సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువ.
కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఢిల్లీలో వాతావరణం ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా కేసులతో పాటు కాలుష్యం కూడా ఢిల్లీలో ఎక్కువగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 2006 నవంబర్ 29 తర్వాత ఢిల్లీలో ఉష్ణోగ్రతలు ఇంతగా తగ్గడం ఇదే మొదటిసారి. 2006, నవంబరు 29న ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైందన్నారు. ఈ సీజన్లో తొలిసారిగా ఢిల్లీలో కోల్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
సాధారణంగా మైదాన ప్రాంతాలలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువ, సాధారణం కంటే 4.5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉన్నప్పుడు వాతావరణ శాఖ చలిగాలులు వీస్తున్నట్లు ప్రకటిస్తుంది. గత ఏడాది నవంబర్లో ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 11.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. అదేవిధంగా, కనిష్ట ఉష్ణోగ్రత 2018లో 10.5 డిగ్రీలు, 2017లో 7.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణశాఖ దగ్గరున్న డేటా ప్రకారం, నవంబర్లో ఇప్పటివరకు కనిష్ట ఉష్ణోగ్రత 3.9 డిగ్రీ సెంటీగ్రేడులుగా 1938, నవంబరు 28న నమోదైంది.