కేంద్ర మంత్రి అమిత్షా నేడు చెన్నైలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన చెన్నై చేరుకుంటారు. అమిత్షా పర్యటనలో సూపర్స్టార్ రజినీకాంత్ గురించే ఆసక్తిగా మారింది. షా రజినీతో సమావేశం అవుతారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
తమిళనాడు రాజకీయాలు ఆసక్తిగా మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేను చిత్తుగా ఓడించాలన్న లక్ష్యంతో బీజేపీ జాతీయ నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా శనివారం మధ్యాహ్నం అన్నాడీఎంకే నాయకులతో పొత్తుపై చర్చలు జరుపనున్నారు. ఈ సారి అన్నాడీఎంకే కూటమిలో ఉన్న బీజేపీ అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. అంతే కాకుండా అధికారంలో భాగస్వామ్యం కూడా పొందాలని ఆ దిశగా ముమ్మరంగా ప్రయత్నిస్తోంది.
బీజేపీ నాయకులు మురుగన్, పొన్రాధాకృష్ణన్ తదితరులు ఇప్పటికే అన్నాడీఎంకే నేతలతో రహస్య మంతనాలు చేస్తున్నారు. ఇక రాష్ట్ర పర్యటనకు వస్తున్న అమిత్షాకు చెన్నై నగరంలో ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ రాష్ట్ర నాయకులు భారీ ఏర్పాట్లు చేపడుతున్నారు. అన్నాడీఎంకే నేతలతో సమావేశం ముగిసిన తర్వాత కళైవానర్ అరంగంలో తేర్వాయ్కండిగ జలాశయాన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అమిత్షా శనివారం తమిళ సూపర్స్టార్ రజనీకాంత్, డీఎంకే మాజీ అధ్యక్షుడు కరుణానిధి తనయుడు ఎంకే అళగిరిని కలుసుకుంటారని తెలుస్తోంది.
వారిలో రజనీకాంత్ను అమిత్షా నేరుగా కలుసుకునే వీలు లేకుంటే వీడియో కాల్ చేసి మాట్లాడతారని చెబుతున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించమంటూ అమిత్షా రజనీకాంత్ను కోరనున్నట్టు తెలిసింది. అయితే అమిత్ షా పర్యటనలో నిజంగా రజినీతో మాట్లాడితే అక్కడి రాజకీయాలు ఆసక్తిగా మారబోతాయి.