ఉగ్ర‌వాదులు భారీ విధ్వంసానికి ప్లాన్ చేశారా.. మోదీ అమిత్‌షా కీల‌క భేటి..

2008 నవంబరు 26న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో 10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు. వీరు వేర్వేరు ప్రాంతాల్లో విచక్షణారహితంగా కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డారు. దీంతో 166 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 300 మంది తీవ్రంగా గాయపడ్డారు.

26/11 ముంబై దాడులు జరిగి పన్నెండేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించాలని కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. నగ్రోటా ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు ఉగ్రవాదులు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారని సమాచారం. ఈ నలుగురు ఉగ్రవాదులు ఇటీవలే భారత దేశంలోకి అక్రమంగా చొరబడినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.

జమ్మూ-కశ్మీరులోని నగ్రోటాలో ఎన్‌కౌంటర్, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ సమావేశమయ్యారు. 26/11 ముంబై దాడులు జరిగి పన్నెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉగ్రవాదులు భారీ ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం అందుతుండటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, మోదీతో భేటీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్థన్ శృంగ్లా, నిఘా సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జమ్మూ-కశ్మీరులో గురువారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. జమ్మూ జిల్లాలోని నగ్రోటా సమీపంలో, బన్ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌పై ఈ సమావేశంలో చర్చించారు.

జమ్మూ జోన్ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ ముఖేశ్ సింగ్ మాట్లాడుతూ, ఉగ్రవాదులు భారీ దాడికి కుట్ర పన్నుతూ ఉండవచ్చునని, జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతంలో జిల్లా అభివృద్ధి మండళ్ళ ఎన్నికలను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండవచ్చునని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here