ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు. అందుకేనేమో ఎక్కడ ఉల్లిగడ్డలు కనపించినా ఇంతకుముందు కొనేవారు.. కానీ ఇప్పుడు దోచుకెళుతున్నారు. అవును దేశంలో ఇప్పుడు ఉల్లిగడ్డల చోరీలు ఎక్కువయ్యాయి. ధరలు పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
తాజాగా చెన్నైలోని ఎరుంపట్టి సమీపంలో 20 బస్తాల ఉల్లి మాయమైంది. నామక్కల్ జిల్లాలోని ఈ ప్రాంతంలో రైతు తన పొలంలో వేసిన ఉల్లిని కోసి దిగుబడులను పొలంలోనే ఉంచారు. వర్షం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా టార్పాలిన్ పట్టలు కప్పి భద్రంగా ఉంచారు. అయితే ఉదయం పొలానికి వెళ్లి ఉల్లిని పరిశీలించగా అక్కడ 40 బస్తాల్లో కేవలం 20 బస్తాల ఉల్లి మాత్రమే ఉంది. దీంతో వెంటనే ఆ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉల్లి దొంగతనం సంచలనంగా మారింది.
ప్రస్తుతం ఆ ప్రాంతంలో కిలో ఉల్లి రూ. 75 పలుకుతోంది. ఇది దృష్టిలో పెట్టుకొని పథకం ప్రకారమే ఉల్లిని దొంగిలించి ఉంటారని అందరూ అనుమానిస్తున్నారు. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు. కాగా ఇటీవలె మహారాష్ట్రలోని పూణెలో గల ఒక గోదాములో నిల్వ ఉంచిన 550 కిలోల ఉల్లి చోరీకి గురయ్యింది. గోదాములోని 38 బస్తాల ఉల్లిని చోరీ చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు. దీనిని గమనించిన ఒక వ్యక్తి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులంతా అక్కడికి చేరుకున్నారన్నారు. వారంతా కలసి ఒక దొంగను పట్టుకోగా, మరొక దొంగ అక్కడి నుంచి పారిపోయాడన్నారు. 10 బస్తాల ఉల్లిని ఎత్తుకెళ్లారు. దేశంలో ఉల్లిరేట్లు పెరిగిపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది.