సామాన్యుల దగ్గర నుంచి ప్రముఖల వరకు ఎవ్వరికీ భద్రత లేకుండా పోతోంది. సోషల్ మీడియా వేదికగా ఇది బాగా ఎక్కువ అవుతోంది. తాజాగా ఓ ప్రొటెం స్పీకర్కు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది.
మధ్య ప్రదేశ్ ప్రొటెం స్పీకర్ రామేశ్వర్ శర్మకు బెదిరింపులు వచ్చాయి. కొందరు అగంతకులు ఆయన్ను చంపేస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి బెదిరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ నన్ను చంపుతామని బెదిరించారు…మీరు ఉగ్రవాదానికి మద్ధతు ఇస్తే ప్రపంచం మొత్తం మీపై పోరాడుతుందని నేను వారికి చెప్పాలనుకుంటున్నాను, ఈ దేశంలో ఉగ్రవాదానికి మద్ధతు లేదు, నేను బెదిరింపులకు భయపడను’’ అని రామేశ్వర్ శర్మ చెప్పారు. కాగా ఈ వ్యాఖ్యలను స్పీకర్ సీరియస్గా తీసుకున్నారు.
ప్రొటెం స్పీకరు రామేశ్వర్ శర్మను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ అసెంబ్లీ సెక్యూరిటీ డైరెక్టరు మధ్యప్రదేశ్ డీజీపీకి లేఖ రాశారు. దీంతో మధ్యప్రదేశ్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 506, 507ల కింద కేసు నమోదు చేశారు. ఈ బెదిరింపులపై తాము దర్యాప్తు చేస్తున్నామని, సోషల్ మీడియాలో బెదిరించిన వారి మూడు ఐడీలు గుర్తించామని భోపాల్ క్రైంబ్రాంచ్ ఏఎస్పీ గోపాల్ ధాకద్ చెప్పారు. వివాదం ఏంటంటే.. ఫ్రాన్సు దేశంలో కార్టూన్ వివాదంపై ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేసిన వ్యాఖ్యలపై కొందరు భోపాల్ నగరంలో నిరసన వ్యక్తం చేశారు. భోపాల్ నగరంలో జరిగిన నిరసనలపై రామేశ్వర్ శర్మ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై ఆగ్రహించిన కొందరు వ్యక్తులు రామేశ్వర్ శర్మపై దాడి చేసి హతమారుస్తామంటూ హెచ్చరికలు చేస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు పెట్టారు.