దేశంలో కరోనా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుందన్న ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో ఎక్కువగా కేసులు వస్తున్నాయి. తాజాగా హెల్త్ బులిటెన్ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.
దేశంలో కొత్తగా 45,576 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 89,58,484కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 585 మంది మృతి మృతి చెందారు. ఇప్పటి వరకూ మొత్తంగా 1,31,578 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4,43,303 యాక్టివ్ కేసులున్నాయి. 83,83,603 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 93.58 శాతం ఉండగా.. మరణాల రేటు 1.47 శాతంగా ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 131 మంది మృతి చెందారు. ఒక్క రోజులో కరోనా కారణంగా మృతి చెందినవారిలో ఇదే అత్యధికం. ఇక గడచిన 24 గంటల్లో కొత్తగా 7,486 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య ఐదు లక్షలను దాటింది. అయితే ప్రజలు కచ్చితంగా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం చెబుతోంది. ఓ దశంలో ఢిల్లీలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారన్న ప్రచారం సాగింది. అయితే దీనిపై స్థానిక వ్యాపారుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రభుత్వం లాక్డౌన్ గురించి ఊసే ఎత్తలేదు. కాగా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఢిల్లీలో కరోనా కేసులపై అప్రమత్తంగా ఉంది. వైద్య పరంగా అందించాల్సిన సహాయాన్ని అందజేసేందుకు ముందుకొచ్చింది.