జమ్ము కశ్మీర్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఉగ్రవాదులు అవకాశం చూసుకొని దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. అక్కడ జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు చనిపోయారు. పలువురు సామాన్య ప్రజలకు సైతం గాయాలయ్యాయి.
జమ్మూ కశ్మీరులోని నగరోటా జిల్లా బన్ టోల్ లాజా వద్ద ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య గురువారం ఉదయం జరిగిన ఎన్కౌంటరులో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు జమ్మూ నుంచి శ్రీనగర్ కు బస్సులో వెళుతుండగా నగరోటా వద్ద భద్రతాబలగాలు జాతీయ రహదారిని మూసివేసి తనిఖీలు చేస్తుండగా ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు జరిపారు. దీంతో కేంద్ర భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు.
ఎన్ కౌంటర్ అనంతరం కేంద్ర బలగాలతో గాలింపు తీవ్రం చేశారు.మరోవైపు పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన గ్రెనెడ్ దాడిలో 12 మంది పౌరులు గాయపడ్డారు. సీఆర్పీఎఫ్ జవాన్లు లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు గ్రెనెడ్ దాడి చేయగా అది తప్పి పౌరులు గాయపడ్డారు. దీంతో పుల్వామాలో భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి. ఇటీవల జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల దాడులు ఎక్కువయ్యాయి. రెండు రోజులకు ఒకసారి భద్రతా దళాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.