కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటున్నారు. అయితే తమ వీధుల్లో కానీ, ఇంట్లో కానీ ఎవ్వరికైనా కరోనా వస్తే వెంటనే అందరికీ సోకే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఓ ఊరిలో ఉన్న వాళ్లందరికీ కరోనా సోకినా ఒక్క వ్యక్తికి మాత్రం కరోనా ఇంతవరకు సోకలేదు. దీంతో కరోనా సోకని ఒకే ఒక్కడుగా ఆయన రికార్డు సృష్టించారు.
హిమాచల్ప్రదేశ్లోని జన్జాతీయ జిల్లా లాహౌల్-స్పీతి పరిధిలోని థొరాంగ్ గ్రామం గురించి మనం చెప్పుకుంటున్నాం. గ్రామంలో మొత్తం వంద మంది ఉంటారు. అయితే మంచు కురుస్తున్న కారణంగా కొంతమంది ఊరు వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు గ్రామంలో 43 మంది ప్రజలు నివసిస్తున్నారు. అయితే వీరందరిలో 42 మందికి కరోనా సోకింది. వైద్యులు వచ్చి అందరికీ పరీక్షలు చేయగా భూషణ్ అనే వ్యక్తికి కరోనా సోకలేదని తేలింది. ఈయన వయస్సు 52 సంవత్సరాలు.
గ్రామంలో కరోనా సోకని వ్యక్తిగా భూషన్ ఠాకుర్ ఒక్కరే నిలిచారు. తాను కరోనా సోకకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకున్నందునే వ్యాధి బారిన పడలేదని తెలిపారు. ఈ సందర్భంగా లాహౌల్- స్పీతికి చెందిన వైద్యులు డాక్టర్ పల్జోర్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన భూషన్ ఇమ్యూనిటీ సిస్టం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. గ్రామంలోని అందరికీ కరోనా పాజిటివ్ వచ్చి, భూషన్కు మాత్రం నెగిటివ్ రావడం విచిత్రంగా అనిపించిందన్నారు. గ్రామానికి చెందిన ఐదుగురు ఇంతకుముందే పాజిటివ్గా తేలారని, ఈ నేపధ్యంలోనే గ్రామంలోని వారంతా స్వచ్ఛందంగా కరోనా టెస్టులు చేయించుకున్నారన్నారు.
కాగా కరోనా సోకని భూషన్ తన ఇంటిలోని వారికి దూరంగా ఒక గదిలో ఒక్కడే ఉంటున్నాడు. స్వయంగా వంట వండుకుంటున్నాడు. కుటుంబ సభ్యులతో పాటు భూషన్ కూడా కరోనా టెస్టు చేయించుకున్నాడు. అతనికి నెగిటివ్ రిపోర్టు వచ్చింది. కరోనాకు తేలికగా తీసుకోవద్దని, మాస్క్ ధరించడంతోపాటు శానిటైజ్ చేసుకోవడం మరచిపోకూడనది భూషన్ చెబుతున్నాడు.