వయస్సు తక్కువగా ఉన్నప్పటికీ ఆధార్ కార్డులో వయస్సు మార్చుకోవడం చాలా మంది చేశారు. అనంతరం పించన్కు అప్లై చేసుకొని అక్రమంగా అర్హులై పింఛన్ పొందారు. దీనిపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో అక్రమంగా పింఛన్ పొందిన వారిలో గుబులు మొదలైంది.
2019లో వై.ఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలో భాగంగా పింఛన్ పెంచారు. ప్రతి సంవత్సరం కొంత పెంచుకుంటూ పోతానని ఆయన చెప్పారు. అదీ కాకుండా వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇస్తున్నారు. దీంతో చాలా మంది అక్రమంగా పింఛన్ పొందారు. వయస్సు తక్కువగా ఉండటంతో అక్రమంగా ఆధార్ కార్డులో వయస్సు మార్పు చేసుకొని పింఛన్ పొందారు. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు 12.42 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసింది.
అర్హత లేకున్నా పింఛన్ పొందుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అనర్హులు పింఛన్ పొందకుండా ఉండేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం కొత్తగా పింఛన్కు దరఖాస్తు చేసుకునే వాళ్లు పలు పత్రాలతో పాటు ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ పత్రాన్ని కూడా సమర్పించాలి. ఇందులో ఎన్ని సార్లు ఆధార్ కార్డును అప్డేట్ చేశారో వివరాలు ఉంటాయి. ఈ వివరాలను బట్టి తక్కువగా ఉన్న వయస్సును పరిగణలోకి తీసుకుంటారు. అర్హులైతేనే పింఛన్కు ఎంపిక చేస్తారు. ఇక ఈ ఏడాది పింఛన్ పొందిన వారు కూడా అర్హులో కాదో పరిశీలించనున్నారు. త్వరలోనే ఈ ఏడాది మంజూరు చేసిన పింఛన్లపై పరిశీలన జరిపి వయస్సు మార్చుకొని పింఛన్ పొందినట్లు తేలితే ఆ పింఛన్లను తొలగించనున్నారు.