గర్బిణి స్త్రీ డెలివరీ అవ్వకముందే తన కడుపులో పెరుగుతున్న బిడ్డను అమ్మకానికి పెట్టేసింది. వరుసగా మూడో సారి అమ్మాయి పుడుతుందన్న కారణంతో ఆమె ఈ పని చేయడానికి సిద్దపడింది. సంతానం లేని ఓ జంట ఈ బిడ్డను కొనేందుకు ముందుకు రావడంతో ఈ వ్యాపారం జరిగింది.
హైదరాబాద్లోని నాచారం రాఘవేంద్ర కాలనీలో మీనా, వెంకటేష్ దంపతులు నివసిస్తున్నారు. వీరు ఆరు నెలల క్రితం గతంలో నాచారంలోనే అంబేద్కర్ నగర్లో నివసిస్తుండేవారు. వీరికి ఇది వరకు ఓ ఆడశిశువు జన్మించి చనిపోగా.. ప్రస్తుతం మరో పాప ఉంది. అయితే మీనా మూడోసారి గర్బం దాల్చింది. కాగా ఈ సారి కూడా ఆడ పిల్లనే పుడుతుందని భావించిన వీళ్లు.. ఈ పాపను అమ్మేయాలనుకున్నారు. దీంతో తమకు సమీపంలో ఉండే నగీమా, రాజేశ్వర్ దంపతులతో వీరికి పరిచయం ఏర్పడింది. వీరికి సంతానం లేదు. దీంతో వీరికి పుట్టబోయే బిడ్డను అమ్మేందుకు ఓ మహిళ మద్యవర్తిత్వం నడిపింది.
పుట్టబోయే బిడ్డను నగీమా, రాజేశ్వర్ దంపతులకు అప్పగించాలని డిసైడ్ అయ్యారు. ఈ ఏడాది జూన్ 19న పండంటి మగ బిడ్డకు మీనా జన్మనిచ్చింది. నాచారం ఈఎ్సఐ ఆస్పత్రిలో చేరిన సమయంలో ఆమె పేరు మీనాగా కాకుండా నగీమా అని తెలిపింది. అనంతరం బిడ్డ పుట్టిన వెంటనే రాజేశ్వర్ దంపతులు తీసుకెళ్లారు. లక్ష రూపాయలకు బిడ్డను అమ్మేశారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఐదు నెలల తర్వాత తమకు పుట్టింది ఆడ పిల్ల కాదని.. మగ బిడ్డ అని తెలుసుకొని మీనా దంపతులు వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులను ఆశ్రయించగా ఈ విషయం మొత్తం బయటకు వచ్చింది. బిడ్డను అమ్మిన వారు, కొన్న వారు, మధ్యవర్తిత్వం వహించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాబును శిశువిహార్కు తరలించారు.