కరోనా పేరు వింటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఎప్పుడూ లేనంతగా ఇది ప్రజలపై ప్రభావం చూపింది. అయితే ఇప్పుడు అధికారుల తీరు మరింతగా ఇబ్బంది పెడుతోంది. కరోనా లేకపోయినా కరోనా ఉందని చెబుతారు. తీరా మళ్లీ లేదు లేదు.. నెగిటివ్ వచ్చిందంటారు.
కరోనా పరీక్షల్లో వచ్చే రిపోర్టులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ట్రూనాట్, వీఆర్డీఏ యంత్రాలు, యాంటిజెన్ కిట్ల ద్వారా కరోనా పరీక్షలు చేస్తున్నారు. అయితే ఈ ఫలితాల వెల్లడి సమయంలోనే గందరగోళం నెలకొంది. పలువురికి మొబైల్కు వస్తున్న మెసేజుల్లో నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ అని ఊపిరి పీల్చుకునేలోపే అధికారులు ఫోన్ చేసి కరోనా పాజిటివ్ వచ్చింది మీరు ఆసుపత్రిలో చేరాలని చెబుతున్నారు.
ఇలాంటికి చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఇంకో చోట 60 ఏళ్ల వృద్దులిద్దరికి కరోనా టెస్టు చేయగా పాజిటివ్ అని మెసేజ్ వచ్చింది. దీంతో వీరు హోమ్ ఐసోలేషన్లో ఉండేందుకు సిద్దపడి పల్స్ ఆక్సీమీటర్లు, పీపీఈ కిట్లు, గ్లౌజులు, శానిటైజర్లు కొని తెచ్చుకున్నారు. అయితే వారికి తెలిసిన వారికి ఈ రిపోర్టు చూపిస్తే నెగిటివ్ వచ్చిందని చెప్పారు.
ఈ తరహాలో పొరపాట్లు చాలా చోట్ల జరుగుతున్నాయి. అధికారులు మాత్రం రిపోర్టుల్లో తేడా ఉండదని.. చెప్పే విధానంలో పొరపాటు అయ్యింటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా ముందే కరోనా అంటే భయపడుతున్న జనాలకు పాజిటివ్, నెగిటివ్ టెన్షన్ ఎక్కువైంది.