కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే వీటిలో అన్ని వ్యాక్సిన్లు వేగంగానే క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుంటున్నాయి. తాజాగా ఆక్స్ఫర్డ్.. ఆస్ట్రాజెనికా టీకా వేయించుకున్న ఓ వాలంటీర్ మృతిచెందడం చూస్తే వ్యాక్సిన్లపైనా ప్రజల్లో ఆందోళన నెలకొంది.
ఆక్స్ఫర్డ్ – ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వేయించుకున్న ఓ వాలంటరీ్ మరణించినట్లు బ్రెజిల్ ప్రకటించింది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి ఆస్ట్రాజెనికా ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. కొన్ని రోజుల క్రితమే బ్రిటన్లో ఈ వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ కూడా అనోరాగ్యానికి గురి కావడంతో మూడోదశ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపేశారు. అయితే బ్రిటీష్ రెగ్యులేటర్స్ నుంచి అన్ని అనుమతులూ లభించిన నేపథ్యంలో ప్రయోగాలను తిరిగి ప్రారంభించారు. ఆ వాలంటీర్ ఈ వ్యాక్సిన్ వేసుకున్న కారణంగానే మరణించాడా.. లేక ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా.. అన్నది అధికారులు వెల్లడించలేదు.
కాగా కరోనా టీకా వేయించుకున్న వాలంటీర్ మృతిచెందారన్న వార్త బయటకు రాగానే అందరిలో ఆందోళన మొదలైంది. అయితే సదరు సంస్థ వ్యాక్సిన్కు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది. అయినప్పటికీ ప్రజల్లో భయాందోళనలు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే రష్యా కూడా వ్యాక్సిన్ తుది దశ ట్రయల్స్ చేస్తోంది. వ్యాక్సిన్ ను అత్యవసరాల కోసం వినియోగిస్తోంది. చైనాలో కూడా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. ఒక్క భారత్లోనే ఇంకా ఎటువంటి వ్యాక్సిన్ను ఇవ్వడం లేదు. అయితే మూడు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన తర్వాతనే వ్యాక్సిన్ ఇస్తే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. లేదంటే తర్వాత వచ్చే చెడు ప్రభావాలను తట్టుకోలేమని ప్రజలు భయపడుతున్నారు.