అమరావతి రాజధానిగా కొనసాగాలంటూ చేస్తున్న ఉద్యమం ఉదృతమవుతోంది. రాజధాని గ్రామాల రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 310వ రోజుకు చేరుకున్నాయి. పైగా అమరావతికి ప్రధాని మోదీ వచ్చి శంకస్థాపన చేసి నేటికి 5 సంవత్సరాలు అయ్యింది. దీంతో రైతులు, మహిళలు ఇంకా ఉద్వేగపూరితంగా ఉన్నారు.
అమరావతిలో నేడు వినూత్న రీతిలో నిరసనలు తెలిపేందుకు అక్కడి స్థానికులు సిద్ధమయ్యారు. శంకుస్థాపనకు గుర్తుగా రాజధాని రైతులు, మహిళల వినూత్న నిరసనలు తెలుపనున్నారు. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. గుంటూరు నుంచి ఉద్దండరాయుని పాలెంలోని శంకుస్థాపన స్థలం వరకు యాత్ర సాగనుంది. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ కలుగజేసుకోవాలని నినాదాలు చేశారు. పాదయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రాయపూడి, మందడం నుంచి కూడా పాదయాత్రగా శంకుస్థాపన చేసిన ప్రాంతానికి చేరుకుంటున్నారు.
ఉదయం 10.30 గంటలకు ఉద్దండరాయునిపాలెంలో సర్వమత ప్రార్థనలు జరుగనున్నాయి. అమరావతి చూపు – మోదీ వైపు పేరుతో వినూత్న ప్రదర్శన చేపట్టనున్నారు. రాత్రికి దీక్షా శిబిరాల వద్ద అమరావతి వెలుగు పేరుతో కాగడాలను ప్రదర్శించనున్నారు. కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది. ఇక దీనిపై కాంగ్రెస్ కూడా స్పందిస్తోంది. ప్రధాని శంకుస్థాపన చేసిన దానికే విలువ ఇవ్వకపోతే ఎలా అని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించిన అమరావతికి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కారు విలువను ఇవ్వకపోయినా…బీజేపీ వారికే వత్తాసు పలుకుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించేందుకే పుట్టామని చెప్పిన రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు ఎందుకు ముఖం చాటేశాయని తులసిరెడ్డి ప్రశ్నించారు.