భారత్లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే యేడాది మార్చిలోగా కరోనా వ్యాక్సిన్ సిద్ధమైపోతుందని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ మరో మూడు నెలల్లో పంపిణీ చేయడానికి సిద్దమవుతుందన్న వార్తలు ప్రజల్లో ధైర్యాన్ని పెంచుతాయని చెప్పొచ్చు.
ఇంకా కేంద్ర మంత్రి ఏమన్నారంటే.. వచ్చే సంవత్సరం సెప్టెంబర్ నాటికి దేశంలోని 30 లక్షల మందికి ఈ వ్యాక్సిన్ అందుతుందన్నారు. మొదటి ప్రాధాన్యత కింద ఆరోగ్య కార్యకర్తల జాబితా ఒకటి తయారవుతోందన్నారు. దానిని త్వరలోనే అప్లోడ్ చేస్తామని వెల్లడించారు. ఆ తర్వాత పోలీసులు, పారామిలటరీ, ఆ తర్వాత 65 ఏళ్ల వయసు పైబడిన వారని.. ఇలా ఓ జాబితాను తయారు చేస్తామని ఆయన తెలిపారు. ఇక రెండో జాబితాలో 50 ఏళ్ల వారు, వేర్వేరు రోగాలతో బాధపడుతున్న వారికి అందజేస్తామన్నారు.
కరోనా కారణంగా పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారినా…దేశంలో పరిస్థితి మాత్రం అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. 90 లక్షల రోగుల్లో దాదాపు 85 లక్షల మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారని, ప్రపంచంతో పోలిస్తే భారత్లోనే రికవరీ రేటు అధికంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కొన్ని నగరాల్లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆ ప్రాంతాల్లో మాత్రం కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని హర్షవర్ధన్ విజ్ఞప్తి చేశారు.