కరోనా కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ముఖ్యంగా కరోనాను నిర్ధారించుకోవడమే ఇప్పుడు అందరికీ కావాల్సిందే. ప్రతి రోజూ 50వేలకు పైగా పలు రాష్ట్రాలు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి. అయినా ఇది సరిపోవడం లేదు. అయితే అమెరికాలో నేడు కొత్త కరోనా పరీక్షల విధానానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
అమెరికాలో ఇప్పటికే ఇంటి నుంచే కొవిడ్-19 పరీక్ష చేసుకునే సదుపాయం ఇప్పటికే ఉంది. కానీ.. లుసిరా టెస్ట్ కిట్ పూర్తిగా స్వీయ-నిర్వహణతో కూడుకుందని చెప్పాలి. ఎవరి అవసరం లేకుండా ఎవరికి వారు పరీక్ష చేసుకోవచ్చు. అంతేకాకుండా మిగతా టెస్ట్ల ఫలితాలు వచ్చేందుకు చాలా సమయం పడుతుంది. లుసిరా టెస్ట్ ఫలితం మాత్రం అరగంటలోపే వచ్చేస్తుంది. ప్రస్తుతం అమెరికాలో కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతోందని.. ఇటువంటి సమయంలో లుసిరి టెస్టింగ్ కిట్ అనేది ముఖ్యమైన రోగనిర్థారణ పురోగతి అని ఎఫ్డీఏ కమిషనర్ స్టీఫెన్ హాన్ ఓ ప్రకటనలో తెలిపారు.
కొవిడ్-19 పరీక్ష చేయించుకునేందుకు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే స్వీయ పరీక్ష(సెల్ఫ్-టెస్టింగ్) చేసుకునే టెస్టింగ్ కిట్కు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. లుసిరా హెల్త్ కంపెనీకి చెందిన ఆల్-ఇన్-వన్ టెస్ట్ కిట్ అత్యవసర వినియోగ అధికారాన్ని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) జారీ చేసింది. అయితే లుసిరా టెస్ట్ను ప్రస్తుతానికి డాక్టర్ల ప్రిస్క్రిప్షన్తో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని ఎఫ్డీఏ పేర్కొంది. అదే విధంగా హెల్త్కేర్ ప్రొవైడర్లు ఈ టెస్ట్లకు సంబంధించిన ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుందని ఎఫ్డీఏ తెలిపింది.
అయితే ఈ టెస్టు కోసం ముందుగా మనం శ్వాబ్ నుంచి నమూనాలు తీసుకోవాలి. అనంతరం దాన్ని నమూనాలు ఉంచే సీసాలో కొద్ది సేపు ఉంచి టెస్ట్ కిట్లో పెట్టాలి. కొద్ది సేపటి తర్వాత కిట్లో ఉండే ఎల్.ఈ.డి ఇండికేటర్స్లో రంగు మారుతుంది. మారిన రంగును బట్టి కరోనా సోకిందో లేదో నిర్ధారణ చేసుకోవచ్చు. దీనికి సంబందించిన వివరాలు వైద్యులు చెబుతారు. అమెరికా తీసుకొచ్చిన ఈ కొత్త విధానం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టెస్టుల కోసం ఎక్కడికో వెళ్లకుండా సొంతంగా చేసుకునే అవకాశం రావడం మంచి పరిణామం అంటున్నారు.