దేశంలో కరోనా కేసులు రోజురోకూ పెరుగుతున్నాయి. దీంతో ప్రజల ఆహార అలవాట్లలో మార్పులు పెరిగిపోతున్నాయి. తాజాగా పెరిగిన కోడి గుడ్ల ధరలు చూస్తే గుడ్డు తినడం సామాన్యులకు భారంగా మారనుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజలంతా రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు కుస్తీ పడుతున్నారు. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటున్నారు. పౌష్టిక ఆహారం అంటేనే ముందుగా రోజుకో గుడ్డు తీసుకోవాలని వైద్యులు కూడా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కోడి గుడ్ల ధరలు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్లో ధరలు పూర్తిగా పడిపోయినా ఇప్పుడు నెమ్మదిగా ధరలు పెరుగుతున్నాయి. పైగా రోజురోజుకూ దీని వాడకం పెరుగుతుండటంతో వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు కోడి గుడ్లు తినడంతో పాటు ప్రభుత్వాలు కూడా గర్బిణీలు, చిన్నారులకు అంగన్ వాడీ సెంటర్ల ద్వారా కోడి గుడ్లను అందిస్తోంది. సామాన్యులతో పాటు ప్రభుత్వ పథకాలకు కూడా కోడి గుడ్ల ప్రాధాన్యం పెరగడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మొన్నటి వరకు మూడు రూపాయల నుంచి ఐదు రూపాయల మధ్యలో కొట్టుమిట్టాడిన ధరలు.. ఇప్పుడు ఏకంగా ఆరు రూపాయలకు చేరాయి. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో కోడి గుడ్డు విలువ సామాన్యులు ఆరు రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దేశంలో కోడిగుడ్ల వినియోగాన్ని పరిశీలిస్తే విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. పదేళ్లలో 40 బిలియన్ల నుంచి వంద బిలియన్లు దాటిందని సర్వేలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కోడిగుడ్ల వినియోగం పెరిగింది. ఈ ఆరు నెలల కాలంలో ఊహించని విధంగా కోడిగుడ్లను పబ్లిక్ తీసుకుంటున్నారు. మరి కోడి గుడ్డు తినడం మంచిదే కానీ ధరలు పెరుగుతూ పోతే కోడిగుడ్డు సామాన్యుల నుంచి షావుకారులకు మాత్రమే అందుబాటులో ఉండే పరిస్థితులు వస్తాయి. దీనిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సామాన్యులు కోరుకుంటున్నాయి.