కరోనా అంటేనే చైనా అంటారు. అలాంటిది అక్కడ కరోనా కేసులు తగ్గిపోయాయి. అయితే మళ్లీ కేసులు పెరుగుతున్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై అందరికీ కరోనా టెస్టులు చేస్తున్నారు. అవసరమైన మేరకు విమాన సేవలు కూడా రద్దు చేశారు.
కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో చైనాలోని అత్యంత రద్దీ అయిన ఎయిర్పోర్టుల్లో ఒకటైన పుడాంగ్ ఎయిర్పోర్టులో విమాన సేవలు రద్దు చేశారు. షాంఘై ప్రాంతంలో ఇటీవల 7 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరందరికీ ఈ ఎయిర్పోర్టుతో సంబంధాలున్నాయి. దీంతో ఈ విమానాశ్రయంలో వైమానిక సేవలు నిలిపివేశారు. అలాగే ఇక్కడ పనిచేసే వేలాదిమంది సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహించారు. కరోనా వైరస్ కేసులు ప్రారంభమైన కొత్తల్లో కూడా చైనాలో ఇలానే వైరస్ వ్యాపించింది. అప్పుడు లాక్డౌన్లు, ప్రయాణాలపై ఆంక్షలు విధించడం వంటి పద్ధతుల ద్వారా ఈ వైరస్ను చైనా చాలా వరకు నియంత్రించింది.
ఇన్నాళ్లకు మళ్లీ ఇక్కడ కరోనా క్లస్టర్ కనిపించింది. ఈ కేసులన్నింటికీ పుడాంగ్ ఎయిర్పోర్టుతో సంబంధం ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానాశ్రయాన్ని మూసివేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగులు, అంతర్జాతీయ విద్యార్థులు, అత్యవసర సిబ్బందికి చైనా ప్రభుత్వం అందజేస్తున్న ప్రయోగాత్మక వ్యాక్సీన్ తెరపైకి వచ్చింది. ఈ వ్యాక్సీన్ను ఎయిర్పోర్టు సిబ్బందికి కూడా ఇస్తే ఎలా ఉంటుందని అధికారులు ఆలోచిస్తున్నారు. మొత్తానికి పుడాంగ్ విమానశ్రయం మూసివేయడంతో ఇక్కడ దాదాపు 500 విమాన సేవలు రద్దయ్యాయి. మొత్తమ్మీద 17,700మందికి కరోనా స్వాబ్ టెస్టులు చేశారు.