జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. గ్రేటర్ ఎన్నికల బరి నుంచి జనసేన చివరి నిమిషంలో తప్పుకున్న విషయం తెలిసిందే. బీజేపీ నేతల రాయబారం తర్వాత ఎట్టకేలకు బరి నుంచి తప్పుకునేందుకు పవన్ కల్యాణ్ ఒప్పుకున్నారు. దీంతో ఏపీలోని ఉప ఎన్నికపై ఆయన దృష్టి పెట్టనున్నారు.
తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. ఇప్పుడు ఈ సీట్ను జనసేన కోరుకుంటోంది. గ్రేటర్ లో తాము బీజేపీకోసం బరి నుంచి తప్పుకున్నామని, ఇందుకు ప్రతిగా తిరుపతి సీటును తమకు ఇవ్వాలని కోరేందుకు జనసేన నేతలు సిద్ధమయ్యారు. అమిత్ షా, నడ్డా సహా పలువురిని కలిసేందుకు జనసేన నేతలు భావించారు. ఢిల్లీ వెళ్లారు. అయితే సోమవారం నుంచి ఇప్పటివరకు వారికి బీజేపీ అగ్రనేతల అపాయింట్మెంట్ ఖరారు కాలేదు.
కాగా ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా పవన్ కళ్యాణ్పై వ్యాఖ్యలు చేశారు. పవన్కల్యాణ్ హైదరాబాద్లో అమ్ముడుపోయి.. తిరుపతి సీటు కోసం ఢిల్లీలో కాసుకు కూర్చున్నారని విమర్శించారు. తిరుపతిలో రోజా మీడియాతో మాట్లాడుతూ జనసేనానిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎవరైనా పార్టీ పెట్టారంటే సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళ్తారు గానీ.. వేరే పార్టీలకు ఓటేయమని అడగడమేంటి? అని ప్రశ్నించారు. జనసేన పార్టీ స్థాపించినప్పుడు బీజేపీ, టీడీపీతో వెళ్లారు.. ఇప్పుడేమో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తప్పుకుని తిరుపతి సీటు కోసం మాట్లాడుతున్నారన్నారు.
గ్రేటర్లో కేసీఆర్ గెలవకూడదంట.. ఇదేంటో అర్థం కావడం లేదన్నారు. గ్రేటర్లో ఎవరిని గెలిపించాలో అక్కడ ప్రజలు నిర్ణయించుకుంటారని చెప్పారు. వీళ్ల క్యారెక్టర్ ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పారు. ఏపీలో బీజేపీ, జనసేన ఉనికే లేదన్నారు. తిరుపతి లోక్సభ ఉపఎన్నికలో వైసీపీదే విజయమని రోజా ధీమా వ్యక్తం చేశారు.