ప్రపంచంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో కఠిన నిబంధనలు మరోసారి అమలు చేస్తున్నారు. పలు దేశాల్లో లాక్డౌన్ తరహా రూల్స్ మళ్లీ తీసుకొస్తున్నారు. ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలంటూ హెచ్చరిస్తున్నారు.
ఇదే తరహాలోనే ఫేస్మాస్క్ ధరించని 1,033 మందికి జరిమానా విధించినట్టు నోయిడా పోలీసులు మంగళగిరి వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ఫేస్మాస్క్ ధరించమని చెబుతున్నా అనేక మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు నోయిడా పోలీస్ కమిషనర్ అలోక్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఫేస్మాస్క్ ధరించని వారిని గుర్తించి, బహిరంగ ప్రదేశాల్లో కరోనా నిబంధనలు పాటించని వారికి చలానా వేయాలంటూ ఆయన అధికారులకు ఆదేశించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఒక్కరోజే అధికారులు చలాన్ల రూపంలో రూ. 1,03,800 వసూలు చేసినట్టు తెలుస్తోంది. కాగా.. భారతదేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 92,21,349 మంది కరోనా బారిన పడగా.. కరోనా కారణంగా 1,34,719 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోపక్క ఇప్పటివరకు కరోనా నుంచి మొత్తం 86,40,934 మంది పూర్తిగా కోలుకున్నారు. త్వరలోనే విజయవంతమైన వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తుందని ప్రపంచదేశాలతో పాటు భారత్ కూడా ఆశిస్తోంది. కాగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులంతా కచ్చితంగా మాస్క్ ధరించాలని చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంది.