ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర డిజిపి స్పందించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అసలేమైందంటే
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి వద్ద జరిగిన చిన్న గొడవలో ఎస్సీ యువకుడైన వరప్రసాద్ను పోలీసులు దారుణంగా కొట్టారు. అంతటితో ఆగకుండా స్టేషన్లో గుండుగీయించారు. ఆ తర్వాత అతన్ని ఇంటికి పంపించేశారు. దీంతో సదరు వ్యక్తి పోలీసు ఉన్నతాధికారులు, ప్రజా సంఘాలను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరాడు.
మీడియా ద్వారా విషయం బయటకు రావడంతో సీతానగరం ఘటనపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాద్యులపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించగా.. డిజిపి హుటాహుటిన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.
సీతానగరం ఘటన ఆంధ్రప్రదేశ్లో దుమారం లేపింది. దళిత యువకుడిపై దాడి చేయడం ఏంటని.. వైకాపా నాయకులు శిరోమండనం చేయించారని చంద్రబాబు మండిపడ్డారు. బాదితుడి తల్లి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో ఎస్సై హేళనగా మాట్లాడారని ఆవేధన వ్యక్తం చేశారు. ఇలా వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఘటనపై సీఎం జగన్ స్పందించిన తీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇలాంటి సంఘటనలను సీఎం ఎప్పటికీ ఉపేక్షించరని వైసీపీ నేతలు చెబుతున్నారు.