భారత్లో కరోనా కేసులు ఒకవైపు విజృంభిస్తుంటే.. మరోవైపు వ్యాక్సిన్ ట్రయల్స్ వేగంగా సాగుతున్నాయి. భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నేడు మరికొందరిపై నిర్వహించనున్నారు.
దేశంలో కరోనా కేసులు 12 లక్షలు దాటాయి. హైదరాబాద్లోని నిమ్స్లో కొవాగ్జిన్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. తొలిదశ ట్రయల్స్లో భాగంగా ఇప్పటికే ఇద్దరికి ఈ ట్రయల్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. నేడు మరికొందరు వాలంటీర్లకు ఫేజ్ 1 వ్యాక్సిన్ ఇచ్చేందుకు నిమ్స్ వైద్యులు సిద్ధమయ్యారు.
ఈ నెల 20వ తేదీన ఇద్దరు వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇవ్వగా.. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. వాలంటీర్లు పూర్తి ఆరోగ్యంతో ఉండటంతో వారిని డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. నేడు మరొక వాలంటీర్కు కొవాగ్జిన్ ఇవ్వనున్నారు. నిమ్స్లో మొత్తం 60 మంది వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు సమాచారం. మరొక వారం రోజుల తర్వాత మరికొందరికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.