ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కొత్త యుద్ధం చేస్తున్నారు. అయితే ఇది రాజ్యాల కోసం చేస్తున్న రాజుల దండయాత్ర కాదు. అమరావతి కోసం జూమ్లో మన చంద్రన్న చేస్తున్న పోరాటం.. క్లారిటీ కావాలా ఇది చదవాల్సిందే..
రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా తాను ముందుండి ప్రజల పక్షాన నిలబడతానని చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారు. అయితే ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో మాత్రం అన్ని ప్రాంతాలను అభివృద్ధి వైపు వెళ్లకుండా ఆయనే అడ్డుకుంటున్నారు. ఏదో అయిపోయినట్లుగా జూమ్ వీడియోల్లో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కోసమే తన ఈ పోరాటమని ఆవేధనతో మాట్లాడతారు చంద్రబాబు.
కానీ అంతగా రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ బాబులు రాజీనామాలు చేసి ప్రజల కోసం పోరాడవచ్చు కదా అంటే మాత్రం ఆ టాపిక్ గురించి పల్లెత్తుమాటైనా అనరు. ఎందుకంటే ఒక్కసారి రాజీనామా చేస్తే ఇక గెలుపు తన కనుచూపుమేరలో ఉండదని చంద్రబాబుకు బాగా తెలుసు. ఇందుకు ఉదాహరణే మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆయన రాజీనామాలు.. మాటలకు తప్ప చేతల్లో చూపక పోవడం.
నిజంగా రాజీనామాలపై చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఎప్పుడో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లేవారు. ఏదో భయపెట్టాలని రాయలసీమ ఎమ్మెల్సీ బీటెక్ రవితో రాజీనామాస్త్రం వేయించి ఆయనేంటో నిరూపించుకున్నారు. ఆరోజు బీటెక్ రవి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఇంతవరకు ఏ ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారన్న దాఖలా కనిపించలేదు.
కడప ప్రాంతం నుంచి శాసనమండలికి ప్రాతినిథ్యం వహిస్తున్న బీటెక్ రవి రాజీనామా చేయగా.. అమరావతి కోసం ఎంతకైనా పోరాడతామంటున్న చంద్రబాబు ఆయన కుమారుడు మాత్రం రాజీనామాలు చేయలేదు. 48 గంటల సవాల్ పూర్తయినా రాజీనామా చేయకుండా తన పోరాటం ప్రజల కోసమని జూమ్ మీటింగుల్లో ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారింది.
దీన్ని బట్టి చూస్తే ఆయన పోరాటం ఎవరి కోసమో అర్థం కావడం లేదు. ప్రజల కోసమైతే రాజీనామాలు చేయాలి. అలా చెయ్యనప్పుడు ఆయనది పోరాటం ఎలా అవుతుంది. ఇక ఇప్పటికీ ఆయన పోరాడుతూనే ఉన్నానని అంటే అది చంద్రబాబు, ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే. దీని కోసమే ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటూ జూమ్ ద్వారా మాట్లాడుతూ ఉంటారు. అవసరమైతే ఎంతవరకైనా పోరాడుతూ ఉంటారు.