రాజధాని తరలింపుపై గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దానికి ప్రతి సవాలుగా కొందరు వైసీపీ నేతలు చంద్రబాబుపై ఘాటుగానే స్పందిస్తున్నారు.
మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ తనస్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జగన్ లక్ష్యమని అన్నారు. తక్కువ సమయంలోనే విశాఖ ఆదాయ వనరుగా మారనుందని తెలిపారు. ఇక అమరావతి రైతులకు ప్రభుత్వం కచ్చితంగా న్యాయం చేస్తుందన్నారు.
చంద్రబాబు నాయుడు ఆయనే మాట్లాడుతున్నారో లేదా డూప్ను పెట్టి మాట్లాడిస్తున్నారో అని విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ అన్నారు. నాలుగు నెలలుగా చంద్రబాబు అడ్రస్సే లేరని మండిపడుతున్నారు.
ఎమ్మెల్యే అదీప్ రాజ్ మాట్లాడుతూ విశాఖపట్నంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని టిడిపి, పచ్చ మీడియా ప్రచార చేస్తోందన్నారు. అమరావతిలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలా చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో అమరావతి అక్రమాలను సాక్ష్యాలతో సహా నిరూపించామని ఆయన చెప్పారు. విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని టిడిపి నిరూపించాలని ఆయన సవాల్ చేశారు.
ఇక విశాఖలో జరిగిన చిన్న చిన్న ప్రమాదాలపై రాజకీయాలు చేస్తున్నారన్నారు. టిడిపి హయాంలో విశాఖ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదాల్లో 53 మంది చనిపోయారన్నారు.