కరోనాకు ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని ఎన్నికల హామీలో పెట్టడం ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చింది. బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఇదే హామీని తీసుకొచ్చింది. దీనిపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అయితే దీనిపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.
కరోనా వ్యాక్సిన్ బీహార్ ప్రజలందరికీ ఉచితంగా ఇస్తామన్న హామీ ఎంత మాత్రమూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. బీజేపీ హామీ సరియైనదా, కాదా అన్న దానిపై సాకేత్ గోఖలే సమాచార హక్కు చట్టం కింద ఈసీని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. బీజేపీ ప్రకటించిన హామీ.. ఎంత మాత్రమూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందికి రాదని స్పష్టం చేసింది. బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది.
ఈ ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. బిహార్ ప్రజలకు మాత్రమే ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తారా.. మిగిలిన రాష్ట్రాలు పాకిస్తాన్ లో ఉన్నాయా అని శివసేన తీవ్రంగా మండిపడింది. మిగితా పార్టీలు కూడా బీజేపీపై తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల సంఘం స్పందించడంతో ఈ విషయంలో ఫులిస్టాప్ పడినట్లు అయ్యింది. ఎన్నికల సంఘం ఇంకా ఏం చెప్పిందంటే. మేనిఫెస్టోలలోని హామీలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండకూడదని, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేదిగా ఉండరాదని, ఓటర్లపై అనవసర ప్రభావాన్ని చూపకుండా ఉంటే సరిపోతుందని ఈసీ పేర్కొంది.