తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్టైలే వేరు. ఆయన ఏ ఊరిలో మాట్లాడుతున్నారో.. ఏ వేదికలో మాట్లాడుతున్నారో అవసరం లేదు. ఆయన చెప్పాల్సింది స్పష్టంగా చెబుతారు. అయితే అది అందరికీ నచ్చాలిగా అంటారు కొందరు. తాజాగా ముంబై ఐఐటీ విద్యార్థులతో చంద్రబాబు మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
ముంబై ఐఐటీ విద్యార్థులతో చంద్రబాబు ఆన్లైన్లో ముఖాముఖి నిర్వహించారు. అంతర్జాతీయ బిజినెస్ ఫెస్టివల్లో భాగంగా చంద్రబాబు ప్రసంగించారు. సైబరాబాద్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించానని ఆయన వెల్లడించారు. ఐటీ కంపెనీల కోసం ప్రపంచమంతా తిరిగానని పేర్కొన్నారు. తన ప్రణాళిక ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయన్నారు. ఇప్పుడు 4 శాతం జీడీపీ హైదరాబాద్ నుంచే వస్తోందన్నారు. ఎంతో ముందుచూపుతో విజన్-2020 రూపొందించానన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో రెండంకెల వృద్ధిరేటు సాధించామన్నారు.
వ్యవసాయంలోనూ 17 శాతం వృద్ధి రేటు సాధించామని వెల్లడించారు. పరిశ్రమల అభివృద్ధిలో దేశ వృద్ధిరేటు 7 శాతం అయితే ఏపీ వృద్ధిరేటు 15 శాతం అని చెప్పుకొచ్చారు. పరిశ్రమల అభివృద్ధికి రూట్ మ్యాప్ తయారుచేసినట్లు చంద్రబాబు చెప్పారు. బాబు ప్రసంగం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారుతోంది. చంద్రబాబు ఎక్కడ మాట్లాడినా ఆయన గురించి ఏ మాత్రం తక్కువ కాకుండా చెప్పుకుంటారని అంతా అనుకుంటున్నారు. అయితే ఇంత చేశానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎందుకు 2019 ఎన్నికల్లో ఓడిపోయారన్నది ఆలోచించాల్సిన అంశం.