ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఇన్ని రోజులు విజయవాడ రమేష్ హాస్పిటల్స్ కోవిడ్ కేర్ సెంటర్ కేసు, అమరావతి భూ కుంభకోణం కేసులతో హీటెక్కిన రాజకీయాలు ఇప్పుడు బెంజ్ కారు చుట్టూ తిరుగుతున్నాయి.
ఏపీలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కుమారుడు గుమ్మనూరు ఈశ్వర్ బెంజి కారును లంచంగా తీసుకున్నాడని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఓ కేసులో ఏ14 నిందితుడిగా ఉన్న వ్యక్తి మంత్రి కొడుక్కి బెంజ్ కారును లంచం ఇచ్చారని చెబుతోంది. ఈ విషయంలో ఏసీబీ కాల్ సెంటర్కు కూడా టిడిపి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై మంత్రి వెంటనే వివరణ ఇచ్చారు. తనకు బెంజ్ కారుకు సంబంధమే లేదన్నారు.
తన కుమారుడికి వేలల్లో అభిమానులు ఉన్నారని, ఎంతో మందికి బహుమతులు ఇస్తుంటారన్నారు. బెంజ్కారుతో తమకు సంబంధమే లేదన్నారు. అయితే మంత్రి వ్యాఖ్యల అనంతరం టిడిపి మళ్లీ స్పందించింది. మంత్రి కొడుకు కారును వాడకపోతే కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఎందుకు ఉంటుందన్నారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. మంత్రి కొడుకుపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎందుకు స్పందించలేదన్నారు. పక్కా ఆధారాలు చూపించాని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు.
దీనిపై మళ్లీ మంత్రి గుమ్మనూరు జయరాం స్పందించారు. బెంజ్ కారు నడిపినంత మాత్రాన తనను ఈఎస్ఐ కుంభకోణంలో ఇరికిస్తూ అయ్యన్నపాత్రుడు చేస్తున్నతప్పుడు ప్రచారం మానుకోవాలని చెప్పారు. తన కొడుకు అతడి స్నేహితుడి కారు నడిపారని చెప్పారు. మొత్తానికి ఏపీలో ఇప్పుడు బెంజ్ కారు రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పొచ్చు. సీఎం జగన్ దీనిపై విచారణ చేసి తన మంత్రి నిజాయితీని నిరూపించొచ్చు కదా అన్న వాదన కూడా పలువురి నుంచి వినిపిస్తోంది.